సాధారణంగా మన దేశంలోనే కాదు.. ఎక్కడైనా సరే.. రహదారులను వాడుకున్నందుకు టోల్ చార్జిలను చెల్లించాల్సి వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే విమానాలకు కూడా నిజానికి సరిగ్గా ఇలాంటి చార్జిలే ఉంటాయి. కానీ వాటిని టోల్ చార్జిలు కాదు.. Route Navigation Facilities Charges (RNFC) అని పిలుస్తారు. అంటే ఆకాశంలో విమానాలు మన దేశానికి చెందిన ఎయిర్స్పేస్ గుండా వెళితే మన దేశానికి ఆయా విమానాలకు చెందిన కంపెనీలు చార్జిలను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అవే ఆ చార్జిలు. జాతీయ, అంతర్జాతీయ విమానాలు ఏవైనా సరే.. మన దేశంలో ఎయిర్స్పేస్ గుండా వెళితే.. ఒక్కో విమానానికి విడివిడిగా చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది. వాటినే ఆర్ఎన్ఎఫ్సీ అని పిలుస్తారు. ఈ చార్జిలను ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెల్లించాల్సి ఉంటుంది. ఏఏఐ మన దేశంలో ఎయిర్స్పేస్ను కంట్రోల్ చేస్తుంది.
అయితే ఎయిర్స్పేస్ విషయానికి వస్తే ఐక్యరాజ్యసమితి నియమాల ప్రకారం ప్రతి దేశానికి దాని సముద్ర తీర ప్రాంతం నుంచి 370 కిలోమీటర్ల వరకు ఎయిర్స్పేస్ ఉంటుంది. ఇక తీర ప్రాంతం లేని దేశాలు అయితే వాటి దేశాల సరిహద్దుల వరకే ఎయిర్స్పేస్ ఉంటుంది. ఆ ఎయిర్స్పేస్లో విమానాలు గాలిలో ఎన్ని నాటికల్ మైళ్లు ప్రయాణించాయి.. అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని విమానయాన కంపెనీల నుంచి ఏఏఐ ఆర్ఎన్ఎఫ్సీలను వసూలు చేస్తుంది. ఇక ఎయిర్స్పేస్లో విమానాలు ప్రయాణించిన దూరంతోపాటు వాటి బరువును కూడా పరిగణనలోకి తీసుకుని సదరు చార్జిలను లెక్కిస్తారు.
మన దేశంలో ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్లను ఏఏఐ నియంత్రిస్తుంది. ఏటీసీ టవర్ల ద్వారా విమానాల రాకపోకలను, ట్రాఫిక్ను నియంత్రిస్తారు. ఇక భారత్కు విశాలమైన ఎయిర్స్పేస్ ఉండడంతో మన దేశం ఎయిర్స్పేస్లో ప్రయాణించే విమానాలకు భారీగానే చార్జిలు పడతాయి. హాంగ్కాంగ్ నుంచి దుబాయ్, షాంగాయ్ నుంచి దోహా, బీజింగ్ నుంచి అబుధాబి వెళ్లే అంతర్జాతీయ విమానాలు మన దేశ ఎయిర్ స్పేస్ను వాడుకుంటాయి. ఇందుకుగాను భారత్ ఎయిర్స్పేస్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలై గుజరాత్ వద్ద ముగుస్తుంది. రిటర్న్ ఫ్లైట్స్ అయితే గుజరాత్ వద్ద ప్రారంభమయ్యే ఎయిర్స్పేస్ అరుణాచల్ ప్రదేశ్ వద్ద ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ రూట్ గుండా ప్రయాణించే అంతర్జాతీయ, జాతీయ విమానాలు ఏవైనా సరే.. ఏఏఐకి ఎయిర్స్పేస్ చార్జిలను చెల్లించాలి.
ఇక సింగపూర్ నుంచి లండన్, ఆస్ట్రేలియా నుంచి ప్యారిస్కు వెళ్లే అంతర్జాతీయ విమానాలకు అండమాన్ నికోబార్ దీవుల వద్ద భారత ఎయిర్స్పేస్ ప్రారంభమవుతుంది. అది భారత్, పాక్ సరిహద్దు అయిన రాజస్థాన్, పంజాబ్ల వద్ద ముగుస్తుంది. దీని పొడవు సుమారుగా 2500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అన్ని కిలోమీటర్ల పాటు ఎయిర్స్పేస్ను వాడుకున్నందుకు ఆయా విమానాలు ఏఏఐకి చార్జిలను చెల్లించాలన్నమాట.
ఇక ఒక్క విమానానికి ఎయిర్స్పేస్ చార్జిలను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం…
చిత్రంలో చూశారుగా.. R అనేది ఫిక్స్డ్ చార్జ్.. రూ.5600గా ఉంటుంది. W అనేది బరువుకు సంబంధించింది. దీన్ని చిత్రంలో చూపిన విధంగా AUW/50000 అనే విలువకు స్క్వేర్ రూట్ చేయడం ద్వారా లెక్కిస్తారు. AUW అంటే విమానం బరువు. దీన్ని కిలోల్లో లెక్కిస్తారు. ఇక D అంటే విమానం ప్రయాణించిన దూరం. దీన్ని చిత్రంలో చూపిన విధంగా GCD/100 అనే విలువకు స్క్వేర్ రూట్ చేయడం ద్వారా లెక్కిస్తారు. GCD అంటే నాటికల్ మైళ్లలో విమానం ప్రయాణించిన దూరం.
ఉదాహరణకు ఈ అంకెలను తీసుకుంటే…
RNFC = 5600 × √(1350nm/100) × √(250000/50000) ≈ 46000 Rs or 700$
అంటే ఒక్క విమానం ప్రయాణించేందుకు సగటు ఎయిర్స్పేస్ చార్జిలు రూ.46వేలు అవుతాయన్నమాట. అదే ఆ విమానం తిరుగు ప్రయాణం చేస్తే మరో రూ.46వేలు అవుతాయి. ఇలా విమానం ఆ రూట్లో ఎన్నిసార్లు తిరిగితే అన్ని సార్లు ఎయిర్స్పేస్ చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే తీరప్రాంతంలో ఎయిర్స్పేస్ను వినియోగించుకుంటే మరో రూ.4వేలు అదనంగా అవుతాయి. అంటే రూ.50వేలు అవుతాయి.
ఇక దేశంలో 24 గంటల సమయంలో 100 విమానాలు కనీసం తిరుగుతాయి. అంటే దాదాపుగా రూ.50 లక్షలు వస్తాయి. ఇవన్నీ తిరుగు ప్రయాణం చేస్తే.. రెట్టింపు అవుతుంది. అంటే రూ.1 కోటి అవుతుంది. అంటే కేవలం విమానాలకు ఎయిర్స్పేస్ ఇవ్వడం ద్వారానే ఏఏఐ నిత్యం దాదాపుగా రూ.1 కోటి వరకు సంపాదిస్తుందన్నమాట. ఇవన్నీ ఉజ్జాయింపు లెక్కలు మాత్రమే. అసలు లెక్కిస్తే.. ఆ చార్జిలు ఇంకా ఎక్కువగానే ఉండేందుకు అవకాశం ఉంటుంది.